Hyderabad: ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు (KCR) బుధవారం జగిత్యాల (Jagtial) జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫాంహౌస్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి మధ్యాహ్నం 12.30 గంటలకు జగిత్యాల సమీకృత కలెక్టరేట్ ఆవరణలోని హెలీపాడ్కు చేరుకుంటారు. 12.35 గంటలకు రోడ్డు మార్గం ద్వారా టీఆర్ఎస్ కార్యాలయానికి చేరుకుంటారు. 12.40 గంటలకు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. 12.55 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి, ఒంటి గంటకు వైద్య కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.
మధ్యాహ్నం 1.15కు సమీకృత కలెక్టరేట్ను ప్రారంభిస్తారు. అక్కడే జిల్లా అధికారులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 3 గంటలకు సమీకృత కలెక్టరేట్ నుంచి బయలు దేరి మధ్యాహ్నం 3.10 గంటల వరకు మోతె శివారులోని బహిరంగ సభాస్థలికి చేరుకుంటారు. అక్కడ సభలో ప్రసంగించి సాయంత్రం 4 గంటలకు హెలికాప్టర్లో తిరిగి ఎర్రవల్లి ఫాంహౌస్కు చేరుకుంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నూతన కలెక్టరేట్ను అందంగా ముస్తాబు చేశారు. బహిరంగ సభా స్థలి వద్ద బారికేడ్లు, వేదిక ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్ను ఆహ్వానిస్తూ భారీ ఫ్లెక్సీలు, కటౌట్లను ఏర్పాటు చేయడంతో జగిత్యాల జిల్లా కేంద్రం గులాబీవర్ణంగా మారిపోయింది.

సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను మంత్రు లు హరీశ్రావు, కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్రెడ్డి, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ సీఎం సభకు సుమారు 2 లక్షల మంది తరలివస్తారని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. వీరి వెంట ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్రావు, సంజయ్కుమార్, బాల్క సుమన్, జీవన్రెడ్డి, ఎమ్మెల్సీ భానుప్రసాద్రావు, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత తదితరులు ఉన్నారు.
సీఎం కేసీఆర్ సభ కోసం కోరుట్ల నియోజకవర్గంలోని అన్ని ప్రైవేట్ స్కూల్స్ సెలవు ప్రకటించాయి. మంగళవారం రాత్రి టీఆర్ఎస్ లీడర్ల సూచన మేరకు ఆయా స్కూల్స్ నిర్వాహకులు స్టూడెంట్లకు వాట్సాప్ ద్వారా సందేశం పంపారు. సీఎం కేసీఆర్ ప్రోగ్రామ్ ఉన్నందున బుధరవారం బడికి సెలవని మెసేజ్ చేశారు. సీఎం సభ కోసం పబ్లిక్ను తరలించేందుకు స్కూల్ బస్సులు అందజేస్తున్నామని, ఇందు కోసం బడులకు ఒకరోజు సెలవు ఇచ్చామని పేరెంట్స్కు పంపిన మెసేజ్లో మేనేజ్మెంట్లు పేర్కొన్నాయి.

సీఎం కేసీఆర్ జగిత్యాల పర్యటన నేపథ్యంలో బందోబస్తు కోసం వచ్చిన ఓ కానిస్టేబుల్ మంగళవారం గుండె నొప్పితో చనిపోయాడు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్ లో డ్యూటీ చేస్తోన్న పరుశురాం సీఎం కేసీఆర్ టూర్ బుధవారం ఉండటంతో బందోబస్తు నిర్వహించడానికి జగిత్యాలకు వచ్చారు. డ్యూటీలో ఉండగా గుండెలో నొప్పిగా ఉందంటూ సాయంత్రం స్థానిక పోలీస్ స్టేషన్ కు వచ్చి పడిపోయాడు. గమనించిన తోటి సిబ్బంది హుటాహుటిన పరశురాంను దవాఖానాకు తరలించగా ట్రీట్మెంట్ పొందుతూ మృతి చెందారు. పరుశురాం సొంతూరు ఉట్నూరు మండలం ఓదెలు గ్రామం. (Agencies)
