హైదరాబాద్ : సంచార జాతుల విముక్తి దినోత్సవంగా ఈనెల 31న అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ జాగృతి ఎంబీసీ, డీఎన్ టీ అధ్యక్షుడు రాచమల్ల బాలకృష్ణ డిమాండ్ చేశారు. శుక్రవారం బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ స్వాతంత్ర్యానికి ముందు సంచార జాతులతో వెట్టిచాకిరీ చేయించారని, వెట్టి నుంచి విముక్తి కల్పించిన ఈనెల 31న అనేక రాష్ట్రాల్లో అధికారికంగా విముక్తి దినోత్సవం నిర్వహిస్తున్నాయని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం సంచార జాతుల సంక్షేమాన్ని గాలికొదిలేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. రజకులు, నాయీ బ్రాహ్మణులపై ఆర్థిక భారం పడొద్దని కేసీఆర్ గారి ప్రభుత్వం 250 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇచ్చిందని గుర్తు చేశారు. వాటికి సంబంధించి రూ.200 కోట్లకు పైగా కరెంట్ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని చెల్లించేందుకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి మనసు రావడం లేదన్నారు.
Also Read-
కుళ్లు, కుతంత్రాల పునాదుల మధ్య కాంగ్రెస్ పార్టీ పుట్టింది. మతాల మధ్య చిచ్చుపెట్టడం తప్ప బీజేపీ ఏం చేస్తున్నదో చెప్పాలన్నారు. సంచార జాతులకు విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. సంచార జాతుల విముక్తి దినోత్సవం అధికారికంగా నిర్వహించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
సమావేశంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నరేశ్ ప్రజాపతి, బీసీ జాగృతి అధ్యక్షుడు ఎత్తరి మారయ్య, జాగృతి నాయకులు కొట్టాల యాదగిరి, మేక లలితా యాదవ్, కోళ్ల శ్రీనివాస్, గోపు సదానందం, కవిత తదితరులు పాల్గొన్నారు.
