సోలార్ విద్యుత్ వినియోగంలో ఆదర్శంగా తెలంగాణ టీఎస్ ఫుడ్స్ సంస్థలో సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు కృషి
తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ శ్రీ. మేడే రాజీవ్ సాగర్
Hyderabad: తెలంగాణ ఫుడ్స్ సంస్థలో సోలార్ విద్యుత్ ద్వారా ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు కాలుష్య నివారణకు కృషి చేయాలని నిర్ణయించినట్లు తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ శ్రీ. మేడే రాజీవ్ సాగర్ తెలిపారు. ఈ సందర్భంగా నాచారంలోని తెలంగాణ ఫుడ్స్ ఫ్యాక్టరీలో టీఎస్ రెడ్కో (తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్) చైర్మన్ వై. సతీష్ రెడ్డితో కలిసి సందర్శించారు.
మేడే రాజీవ్ సాగర్ మాట్లాడుతూ సంస్థలో ఇప్పుడున్న ఫ్లాంట్ తో పాటు మరో నూతన ఫ్లాంట్ అందుబాటులోకి వస్తే ఇప్పటికే నెలకు దాదాపుగా రూ. 28 లక్షలు వస్తున్న విద్యుత్ బిల్లు మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి సౌర విద్యుత్ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు.
సంస్థలో సౌర ఫలకాలు ఏర్పాటు చేయడానికి స్థలం, రాష్ట్ర సర్కార్ పోత్సాహం ఉండడంతో అటువైపు ఆలోచించినట్లు వివరించారు. సౌర విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేస్తే విద్యుత్ ఖర్చులు దాదాపు 50 శాతం తగ్గుతాయి. ఆ డబ్బులను సంస్థ అభివృద్ధి కొరకు వినియోగించనున్నట్లు స్పష్టం చేశారు. సౌర విద్యుత్ వల్ల మనకు కావాల్సిన విద్యుత్ ను మనమే తయారు చేసుకోవడంతో పాటు పర్యావరణ కాలుష్యాన్ని కొంత మేర తగ్గించవచ్చని వివరించారు.
ఇందుకోసం టీఎస్ రెడ్కో (తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్) చైర్మన్ వై. సతీష్ రెడ్డితో కలిసి ఫ్యాక్టరీని సందర్శించినట్లు తెలిపారు. సౌర విద్యుత్ వ్యవస్థ ఏర్పాటుకు ఎంత ఖర్చు అవుతుంది. టీఎస్ రెడ్కో ఏ విధంగా సాయం చేస్తుందో అడిగి తెలుసుకోవడం జరిగిందన్నారు.
ఈ సందర్భంగా టీఎస్ రెడ్కో చైర్మన్ వై. సతీష్ రెడ్డిని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్టరీ జీఎం విజయలక్ష్మీ,, హెచ్ఆర్ మేనేజర్ కృష్ణవేణి, వర్క్స్ మేనేజర్ శ్రీనివాస్ నాయక్, ప్రాసెస్ మేనేజర్ ఏలమంద, పర్చేస్ మేనేజర్ వెంకటయ్య , డిప్యూటీ మేనేజర్లు కోటేశ్వరావు, బాబు గార్లతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
