Hyderabad: “తొలి దశ ఉద్యమంలో ప్రపంచానికి తెలంగాణ గళాన్ని వినిపించారు. మలిదశ ఉద్యమంలో అమరవీరులు, ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. తెలంగాణ ఆకాంక్షలను నేరవేర్చుకోవడానికి తుది దశ ఉద్యమానికి సిద్ధం కావాల్సిన సందర్భం వచ్చింది” అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడైన కాసోజు శ్రీకాంతాచారి 13వ వర్ధంతి సందర్భంగా శనివారం ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
“చాలా ఏళ్ల తరువాత ఉస్మానియా యూనివర్సిటీలో తిరిగి తెలంగాణ చైతన్యం కనిపిస్తోందన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని, పోరాట పటిమను కోల్పోలేదు. ప్రపంచ చరిత్రలో తెలంగాణ అంటే గుర్తొచ్చేది ఉస్మానియా యూనివర్సిటీ. ఉస్మానియా అంటే గుర్తుకు వచ్చేది విద్యార్ధి ఉద్యమకారులు, విద్యార్థి అమరులు. తెలంగాణ సమాజంపై ఆధిపత్యం చెలాయించాలని ఆలోచన చేసినప్పుడల్లా నిటారుగా నిలబడి కొట్లాడిన గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ. అటువంటి ఖ్యాతి కలిగిన ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ మలిదశ తొలి అమరుడు శ్రీకాంత్ చారి వర్ధంతి సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో నన్ను భాగస్వామిని చేయడం సంతోషాన్ని కలిగిచింది.”
రేవంత్ రెడ్డి మాట్లాతూ… “తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో ఉద్యమం చేసింది ఎవరూ, ప్రాణాలు ఆర్పించిందెవరూ, జేఏసీలు ఏర్పాటు చేసి పోరాడిందెవరూ, ఇప్పుడు రాజ్యాన్ని ఏలుతుందెవరూ.. ఈ 8 ఏళ్లుగా మనమందరం చూస్తూనే ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ అధికారం పోయే ప్రమాదం ఉన్నా అమరుల త్యాగాలు వృధా కాకూడదు 60 ఏళ్ల తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చాలనే సదుద్దేశంతో శ్రీమతి సోనియాగాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. ఉద్యమకారులు, మేధావులు, కవులు, కళాకారులు తదితరులతో కూడిన ఒక సలహా సంఘాన్ని ఏర్పాటు చేసి తెలంగాణకు ఏదీ మంచిదో అదే చేస్తాం అని టీఆర్ఎస్ తన మ్యానిఫెస్టోలో వాగ్ధానం చేసింది. దీన్ని మేము కూడా నమ్మాం. తెలంగాణ శాసనసభ తొలి సమావేశంలో తెలంగాణ మలి దశ ఉద్యమంలో అమరులైన 1200 మంది కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం, రూ. 10 లక్షల ఆర్థిక సాయం, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, వ్యవసాయం కోసం 3 ఎకరాల భూమి ఇస్తాం అని ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది. దీనికి పార్టీలకతీతంగా అందరం మద్దతు ఇచ్చాం. ఇది జరిగి 8 సంవత్సారాలు అవుతున్నా 550 కంటే ఎక్కువ మంది అమరులను ప్రభుత్వం గుర్తించలేదు. గుర్తించిన కొంత మంది అమరులకు సంబంధించిన పత్రాల్లో అడ్రస్ తెలియదని రాశారు. ఇంతకంటే అవమానకరం మరొకటి ఉంటుందా? చిన్న అగ్గిపుల్ల తాకితేనే అమ్మ అని అంటాం. కానీ శ్రీకాంతాచారి ఒంటిమీద పెట్రోల్ పోసుకుని ప్రాణాలు పోతున్నకూడా జైతెలంగాణ అని నినదించాడు. బతికితే తెలంగాణ కోసం మళ్లీ చావడానికైనా సిద్ధమన్నాడు. ఒకవేళ నేను చచ్చినా తెలంగాణ రాకపోతే మళ్లీ జన్మించి ప్రాణత్యాగం చేస్తా అన్న శ్రీకాంత్ చారి ప్రభుత్వానికి గుర్తు రాలేదా? మొన్నటి మొన్న కాకతీయ యూనివర్సిటీ స్టూడెంట్ సునీల్ నాయక్ ‘‘నేను చేతకాక చావడం లేదు. ఉద్యోగాల అనే ముసుగుతో అధికారమెక్కిన ఈ పాలకులకు కనువిప్పు కలగాలి ‘‘ అంటూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆనాటి శ్రీకాంత్ చారి నుంచి ఈనాటి సునీల్ నాయక్ వరకు జరిగిన త్యాగాలు ఎన్నో. ప్రపంచ చరిత్ర పుటల్లో ఎక్కాల్సిన ఇటువంటి త్యాగాలకు దక్కాల్సిన గౌరవం రానీయకుండా ప్రభుత్వం చేస్తున్న కుట్రలను విద్యార్థులందరూ గమనించాలి.”

“గతంలో ఓయూకు రాకుండా నన్ను అడ్డుక్కోవాలని చూసినా వచ్చి విద్యార్థులకు అండగా ఉన్నా. మీకడుపు నిండితే, మీ ఇల్లు పండితే చాలా? తెలంగాణలో నిరుద్యోగులు, యువత గురించి పట్టించుకోరా అని రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మీరు నియమించిన బిశ్వాల్ కమిటీ తెలంగాణలో 1.92 లక్షల ఖాళీలు ఉన్నాయని పేర్కొంది. 9 ఏళ్లు అయిన ఆ ఖాళీల భర్తీ ఎందుకు ప్రారంభించ లేదు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ సంస్థ (సీఎంఐఈ) ప్రకారం..దేశంలో నిరుద్యోగం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ టాప్ 5లో ఉంది. దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే మొదటి స్థానంలో ఉంది. దేశ యావరేజ్తో చూసినా రాష్ట్రంలో 2 శాతం నిరుద్యోగం అధికంగా ఉంది. రాష్ట్రంలో 8.8 శాతం నిరుద్యోగ రేటు ఉంటే.. దేశంలో 6.8 శాతంగా ఉన్నట్లు సీఎంఐఈ డేటాలో తేలింది. సమస్య ఇంత త్రీవంగా ఉంటే ప్రభుత్వం కనీసం సమీక్ష చేసిన పాపాన పోలేదు.”
“గిరిజన ప్రాంతాల్లో ఉన్న 5,648 సింగిల్ టీచర్ స్కూళ్లను ప్రభుత్వం మూసివేయించింది. ఇది దళితులు, గిరిజనులను చదువుకు దూరం చేయడం కాదా? కిలోమీటరుకో ప్రాథమిక పాఠశాల, 3 కిలోమీటర్లకు ఒక ప్రాథమికోన్నత పాఠశాల, 5 కిలోమీటర్లకు ఒక హైస్కూల్, ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజీ, రెవెన్యూ డివిజన్ కు ఇంజనీరింగ్ కాలేజ్, జిల్లాకో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసి ప్రతి పేదవాడి విద్యను అందించాలని గత ప్రభుత్వాలు భావిస్తే ఆ ఆశయం నుంచి తెలంగాణ ప్రభుత్వం దూరం జరుగుతోంది. ఉస్మానియా, కాకతీయ, మహాత్మాగాంధీ, పాలమూరు లాంటి యూనివర్సిటీలలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల వందల సంఖ్యలో ఏళ్ల తరబడి ఖాళీగా ఉండటంతో ఆ యూనివర్సిటీలు వెలవెలబోతున్నాయి. యూనివర్సిటీలను నిర్వీర్యం చేయడం వెనక ప్రభుత్వ కుట్రను గమనించాల్సిన అవసరం ఉంది.”

“60 ఏళ్ల ఉద్యమం ఫలితంగా సాధించుకున్న తెలంగాణలో అనుకున్న ఆశయాలు నేరవేరయా లేదా అని విశ్లేషించుకోవాల్సిన సందర్భం వచ్చింది. తీవ్రమైన సమస్య వచ్చినపుడు రాజకీయ నాయకులమంతా ఓయూ వైపు చూస్తాం. ఇన్నాళ్లుగా ఓయూ ఎందుకు కార్యక్రమాలు నిర్వహించడం లేదని అనుకున్నా. కానీ ఈ కార్యక్రమంతో తుది దశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదాల్సిన సందర్భం ఇది. తొలి దశ ఉద్యమంలో ప్రపంచానికి తెలంగాణ గళాన్ని వినిపించారు. మలిదశ ఉద్యమంలో అమరవీరులు, ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. తెలంగాణ ఆకాంక్షలను నేరవేర్చుకోవడానికి తుది దశ ఉద్యమానికి సిద్ధం కావాల్సిన సందర్భం వచ్చింది అని విద్యార్ధులకు పిలుపునిచ్చారు. తెలంగాణలో దుర్మార్గపు రాజ్యం నడుస్తోంది. 60 ఏళ్ల ఆంధ్రా పాలనలో కూడా ఇంత దారుణం జరగలేదు. ఓయూలోకి పోలీసులు రావాలంటే గతంలో భయపడేవారు. కానీ ఇపుడు పోలీసులు ఓయూలోకి వచ్చి అణచివేస్తున్నారంటే ఈ పాలన ఎలాంటిదో అర్థం చేసుకోండి. రాచరికపు మనస్తత్వంతోనే తెలంగాణలో అణచివేత సాగుతోంది.”
“తెలంగాణ వస్తే రక్తం చిందదన్నారు.. కానీ ఎన్ కౌంటర్లు జరిగాయి. కేసీఆర్ నక్సలైట్ల ఎజెండా ఎక్కడపోయింది. కుటుంబానికి పదవులు ఇవ్వాలని ఏ ఏ నక్సలైట్ల ఎజెండాలో రాసి ఉంది? పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించాలని, అమరు కుటుంబ సభ్యులకు ప్రజా ప్రతినిధులుగా అవకాశం ఇవ్వకూడదని, ప్రతిపక్షాల గొంతు నొక్కాలని ఏ ఎజెండాలో ఉంది. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, స్వయం పాలన కోసం తెలంగాణ రాష్ట్రం తెచుకున్నాం. నిజాం నవాబులు కూడా అభివృద్ధి చేశారు. అభివృద్ధి నమూనా అయితే నిజాంకు వ్యతిరేకంగా ఎందుకు పోరాటం జరిగింది. సమైక్య పాలకులు సంక్షేమ పాలన అందించిన తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది. ఆధిపత్యం, అణచివేతల వల్లే పోరాటాలు ఉద్భవించాయి. సామాజిక న్యాయాన్ని కేసీఆర్ తుంగలో తొక్కారు. సామాజిక న్యాయం లేని రాష్ట్రం రాష్ట్రమే కాదు. మళ్లీ అలజడి రేగితే అందులో కేసీఆర్ కాలి బూడిద అవుతావు తెలంగాణ సమాజాన్ని తక్కువ అంచనా వేయకు కేసీఆర్. బూట్లు చేతపట్టుకుని పరుగెత్తేలా చేస్తారు జాగ్రత్త. మొన్ననే నవంబర్ 29న దీక్షా దివస్ అంటూ ఒక్క బక్క పలుచటోడు ఒక్కడై కదిలి తెలంగాణను సాధించాడు అని టీఆర్ఎస్ నాయకులు జోరుగా సంబరాలు చేసుకున్నారు. కానీ ఆదే రోజున శ్రీకాంతా చారి ఆత్మబలిదానం చేసుకుంది. ఆ రోజు చర్చ జరిగితే శ్రీకాంతాచారి బలిదానం గురించి జరగాలి.”

“చివరకు అమరవీరుల స్థూపం కూడా కాంట్రాక్టు ఆంధ్రా వాళ్లకు అప్పగించారు. రూ. 62 కోట్లతో మొదలు పెడితే రూ. 200 కోట్లకు చేరింది. 15 నెలల్లో పూర్చి కావల్సింది 6 ఏళ్లు అయినా కాలేదు. రూ.200 కోట్లు రూ.300 కోట్లు అయ్యే పరిస్థితి వచ్చేలా ఉంది. యాదాద్రి పునర్ నిర్మాణం కూడా ఆంధ్రావాళ్ల కనుసన్నుల్లోనే జరిగింది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని పెద్దలు భవిష్యత్ ప్రణాళిక రూపొందించండి. మేం ఎం చేస్తే తెలంగాణకు మేలు జరుగుతుందో చెప్పండి. దాన్ని అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఇతరుల్లా చెప్పేదొకటి చేసేదొక మనస్తత్వం నాది కాదు. తెలంగాణ ఆత్మగౌరవం కోసం కృషి చేయాల్సిన బాధ్యత మాపై ఉంది. మీరు ఇచ్చిన సూచన పత్రాన్ని మా మేనిఫెస్టోలో పెడతాం. తెలంగాణ సమాజం కేసీఆర్ కు సర్వం ఇచ్చింది. ఇక ఇచ్చేదేం లేదు. కేసీఆర్ ను దించితేనే యువతకు ఉద్యోగాలు వస్తాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.”
