హైదరాబాద్ : ఖమ్మం వెలుగుమట్ల బాధితులకు అండగా నిలిచేందుకు వెళ్లిన ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఒక ప్రకటనలో ఖండించారు. వెలుగుమట్ల బాధితులతో కలిసి ఖమ్మం కలెక్టర్ ను కలిసేందుకు వెళ్తున్న కోరిన విశారదన్ మహరాజ్ ని పోలీసులు అరెస్ట్ చేసి మొదట కొణిజర్ల పోలీస్ స్టేషన్ కు అక్కడి నుంచి వైరాకు తరలించి ఇబ్బందులకు గురి చేయడం దారుణమన్నారు. వెంటనే విశారదన్ మహరాజ్ గారిని విడిచి పెట్టాలని డిమాండ్ చేశారు.
మరోవైపు తెలంగాణ ఉద్యమంలో లేని రేవంత్ రెడ్డి తెలంగాణ చరిత్రను రూపుమాపే దుస్సాహసం చేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఒక ప్రకటనలో మండిపడ్డారు. చరిత్ర నిర్మాణంలో పాల్గొనని వారు మొదట చేయాలనుకునే పనే చరిత్రను చెరిపివేయడం ఆన్నారు. అది కుదరకపోతే చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తారని చెప్పారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి కూడా అదే పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read-
తెలంగాణ శాసన సభ ప్రాంగణంలో ఈరోజు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆవిష్కరించిన తెలంగాణ తల్లి విగ్రహంపై స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టించిన ఆ విగ్రహం తెలంగాణ చరిత్రను అమానించేలా ఉందన్నారు. బతుకమ్మ లేకుండా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ ఆత్మకు ఎంతమాత్రం కూడా ప్రతిరూపం కాదని చెప్పారు. సమస్త తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ అని అన్నారు. తమ ములాలను మదిలో తలుస్తూ తెలంగాణ బిడ్డలంతా కూడా ఉద్యమ సందర్భంలో తెలంగాణ తల్లికి అపురూపంగా ఇచ్చిన రూపమే బతుకమ్మతో కూడిన తెలంగాణ తల్లి అని స్పష్టం చేశారు. రాష్ట్రోద్యమ కాలంలో ఏర్పరచుకున్న తల్లి రూపురేఖలు మార్చడం, ఉద్యమ గుర్తులను చెరిపేయటమంటే అది మూర్ఖపు పనేనని ఆమె అన్నారు.
తనకు స్థానం లేని ఉద్యమ చరిత్రను రూపుమాపుతున్నానని భ్రమిస్తూ రేవంత్ రెడ్డి అల్ప సంతోషంలో ఉన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో బతుకమ్మ లేని తెలంగాణ తల్లిని అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక అమరుల త్యాగాలను ఒడిసి పట్టుకున్న నాటి ఉద్యమ తెలంగాణ తల్లిని అదే చోట ప్రతిష్టిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని సగౌరవంగా కాంగ్రెస్ కు ఆఫీస్ కు తరలిస్తామని తేల్చిచెప్పారు.
