హైదరాబాద్ : 2026 సంవత్సరానికి గాను గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల జాబితాలో తెలంగాణ రాష్ట్రానికి విశేష ప్రాధాన్యత లభించడం రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణమని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.

వివిధ రంగాల్లో అసాధారణ సేవలు అందించిన కళాకారులకు పద్మశ్రీ పురస్కారాలు లభించడం రాష్ట్ర ప్రతిభకు దక్కిన అత్యున్నత గౌరవంగా ఆయన అభివర్ణించారు. సైన్స్ రంగంలో చంద్ర మౌళి, కృష్ణమూర్తి, కుమారస్వామి తంగరాజ్ చేసిన పరిశోధనలు దేశ విజ్ఞానాభివృద్ధికి దోహదపడినవని తెలిపారు. వైద్య రంగంలో గూడూరు వెంకట్ రావు, విజయ ఆనంద్ రెడ్డి ప్రజల ఆరోగ్య పరిరక్షణలో అందించిన సేవలు అభినందనీయమని అన్నారు.

కూచిపూడి నృత్య కళలో దీపికా రెడ్డి భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారని ప్రశంసించారు. పశుసంవర్ధక రంగంలో విశేష సేవలు అందించిన రామారెడ్డి మామిడికి (మరణానంతరం) పద్మశ్రీ లభించడం ఆయన సేవలకు సముచిత గౌరవమని పేర్కొన్నారు.

Also Read-
ఈ అవార్డులు వ్యక్తిగత ఘనతకే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి దక్కిన గౌరవంగా భావించాలని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. వీరందరి జీవితాలు, సేవలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని, ముఖ్యంగా యువతకు స్ఫూర్తినిస్తాయని తెలిపారు. ఈ ఘనత సాధించిన ప్రతి ఒక్కరికీ తన తరఫున, టీపీసీసీ తరఫున, అలాగే తెలంగాణ ప్రజల తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
