హైదరాబాద్ : పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఉపవాస దీక్షలు, ప్రార్థనలు, దానం ధర్మాలతో ఆధ్యాత్మిక పరిపూర్ణత సాధించే ఈ పవిత్ర నెల సమాజంలో సౌహార్దత, సహన భావం, సోదరభావాన్ని మరింత బలపరుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ నెలలో ముస్లిం సోదరులు పాటించే నియమ నిష్ఠలు ప్రతి ఒక్కరికీ ఆదర్శమని కొనియాడారు. అవసరాల్లో ఉన్న వారికి జకాత్, ఫిత్రా రూపంలో సహాయం చేయడం ద్వారా సమాజంలో సమానత్వం, దాతృత్వం పెంపొందుతాయని తెలిపారు.
Also Read-
తెలంగాణ రాష్ట్రం సాంప్రదాయంగా అన్ని మతాలను సమానంగా గౌరవించే నేల అని పేర్కొన్న మహేష్ కుమార్ గౌడ్, సెక్యులర్ విలువలను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ మైనారిటీల అభ్యున్నతికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం సోదరుల సంక్షేమం కోసం పలు పథకాలు అమలు చేస్తోందని గుర్తు చేశారు.
ఈ పవిత్ర రంజాన్ మాసం దేశంలో శాంతి, ఐక్యత, సామరస్యాలకు దారితీయాలని, ప్రతి ఇంట్లో సుఖసంతోషాలు నెలకొనాలని ఆకాంక్షించారు. అల్లాహ్ కరుణ కటాక్షాలు అందరిపై ఉండాలని, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగాలని మహేష్ కుమార్ గౌడ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
