హైదరాబాద్ : డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రాంగణంలో పది ఎకరాల స్థలాన్ని జవహర్ లాల్ నెహ్రు అర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయాని (JNFAU) కి కేటాయించాలన్న ప్రభుత్వ ఆలోచనను విరమించు కోవాలని గురువారం అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో అన్ని ఉద్యోగ సంఘాల నాయకులు జాయింట్ యాక్షన్ కమిటీ గా ఏర్పడి ముక్త కంఠంతో ఖండించారు.
ఈ సందర్బంగా ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ… భారత దేశంలోనే మొట్ట మెదటి సార్వత్రిక విశ్వవిద్యాలయం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం. అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెడుతూ, ఈ విశ్వవిద్యాలయం ఎంతో మంది సబ్బండ, పేద విద్యార్థులకు దూర విద్య ద్వారా విద్యానభ్యసించుకొనే వెసులుబాటు కల్పిస్తుంది. విద్యార్థుల సంఖ్య ప్రతియేటా పెరుగుతూనే ఉంది. ఇప్పటికే యూనివర్సిటీ లో ఉన్న బిల్డింగ్స్ ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిపోకపోవడంతో అటు విద్యార్థులు, ఉద్యోగస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. విద్యార్థుల అవసరాల కోసం బిల్డింగ్స్ నిర్మించాల్సిన అవసరం ఉంది. గుట్టలు రాళ్లతో నిండిన క్యాంపస్ లో ఒక్క ఎకరం జాగా కూడా నిర్మాణాలకు అనువుగా లేదు.
ఈ తరుణంలో తెలంగాణ ప్రభుత్వం యూనివర్సిటీ స్థలాలను ఇతరులకు కేటాయిస్తే భవిష్యత్తులో తమ యూనివర్సిటీ అభివృద్ధికీ, విస్తరణకు అవకాశం ఉండదని యూనివర్సిటీ ఉద్యోగులు జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వరంలో ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం తమ ఆలోచనను విరామించుకోకపోతే తీవ్రమైన ఉద్యమం ప్రారంభిస్తామని జాయింట్ యాక్షన్ కమిటీ తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని విరమించుకోవాలంటూ ఇంచార్జ్ రిజిస్ట్రార్ ప్రొ. ఇ. సుధారానికే వినతి పత్రాన్ని సమర్పించారు.
Also Read-
ఈ నిరసన కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అన్ని ఉద్యోగ సంఘాల నాయకులూ ప్రొ. పల్లవి కాబ్దే, ప్రొ. పుష్పా చక్రపాణి, ప్రొ. మాధురి, ప్రొ. చంద్రకళ, డా. పి. వెంకట రమణ, డా. భోజు శ్రీనివాస్, డా. బానోత్ ధర్మ, డా. వెంకటేశ్వర్లు, డా. ఎల్వీకే రెడ్డి, డా. కృష్ణా రెడ్డి, ఎన్. సి. వేణు గోపాల్, నారాయణ రావు, జి. మహేశ్వర్ గౌడ్, ఎం. డి. హబీబుద్దీన్, కాంతం ప్రేమ్ కుమార్, డా. యాకేష్ దైద, రజనీ కాంత్ మరియు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.