మైనార్టీలపై బీజేపీ, బీఆర్ఎస్ విద్వేషం
తెలంగాణ కేబినెట్లో మైనార్టీ మంత్రి ఉండొద్దా?
రాజకీయ లబ్ది కోసం మతాల మధ్య చిచ్చు పెడతారా..?
బీజేపీ, బీఆర్ఎస్ పై ధ్వజమెత్తిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్ : తెలంగాణ కేబినెట్లో కాంగ్రెస్ సీనియర్ మైనార్టీ నేత, భారత క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ అజారుద్దీన్కు చోటు కల్పిస్తుంటే ఓర్వలేక బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కుట్రలు పన్నుతున్నాయంటూ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర్యోద్యమ కాలం నుంచే కులమతాలన్నీ కలిసి కట్టుగా ఉండాలని చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు.
స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా లౌకిక వాదంతో ముందుకు పోవాలన్న కాంగ్రెస్ పార్టీ ఆలోచనే ఇప్పటికీ దేశాన్ని సమైక్యంగా ఉంచిదన్న విషయాన్ని గుర్తు చేశారు. కానీ, ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయంగా పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తూ ముందుకు పోతున్న విషయాన్ని అందరూ గమనించాలన్నారు ఎంపీ చామల.
గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 8 సీట్లు పొందడానికి బీఆర్ఎస్తో చేసుకున్న అంతర్గత ఒప్పందమే కారణమన్నారు. కేంద్రంలో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకూడదని, రాష్ట్రంలోనూ అధికారంలో ఉండకూడదన్న కుట్రతోనే బీజేపీ, బీఆర్ఎస్ ఏకమయ్యాయన్నారు. ఈ రెండు పార్టీలు గతంలో చేసిన కుట్రలను తాను చెప్పడం కాదని, కేసీఆర్ కూతురైన కవిత గారే ఎన్నో వేదికలపై బయటపెట్టారన్నారు ఎంపీ చామల. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నిక్లలోనూ కాంగ్రెస్ను ఓటగొట్టాలన్న లక్ష్యంతోనే ఈ రెండు పార్టీలు ఏకమయ్యాయన్నారు.
Also Read-
కాంగ్రెస్ పార్టీ వైపు ఓటర్లు ఉన్నారన్న విషయం ఎన్నికల సర్వేల్లో వెల్లడవుతుండడంతో ఆ రెండు పార్టీల్లోనూ కలవరం మొదలయ్యిందని, అందుకే జూబ్లీహిల్స్లో మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్ నగరంలో ఓ మంచి మైనార్టీ నాయకుడిగా ఎదిగిన అజారుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వాలన్న ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంటే, దానికి అడ్డుకట్ట వేయడానికి బీజేపీ, బీఆర్ఎస్ విశ్వప్రయత్నాలు చేస్తున్నాయని చామల విమర్శించారు.
బీజేపీ నేతలు ఇవాళ ప్రత్యక్షంగా ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ చేయడమే ఈ కుట్రకు నిదర్శనమని ఆయన అన్నారు. కేవలం ఫిర్యాదుతోనే బీజేపీ ఆగడం లేదని, అజారుద్దీన్కు మంత్రి పదవి దక్కకుండా చేయడం కోసం గవర్నర్పైనా ఒత్తిడి తెచ్చి మంత్రి వర్గ విస్తరణ కార్యక్రమం జరగకుండా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోందన్నారు. తెలంగాణలోని మైనార్టీ సోదరులు, మరీ ముఖ్యంగా జూబ్లీహిల్స్ మైనార్టీ సోదరులు ఈ విషయాన్ని గుర్తించాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరారు.
భారత క్రికెట్ టీమ్ ప్లేయర్గా, కెప్టెన్గా అజారుద్దీన్ ఎంతో ఖ్యాతిని గడించి హైదరాబాద్ పేరును ప్రపంచ పటంపై పెట్టాడు. ఎంతోమంది క్రికెటర్లు అయ్యేందుకు స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి రాష్ట్ర కేబినెట్లో చోటు కల్పిస్తుంటే ఎందుకు ఓర్చుకోలేకపోతున్నారంటూ బీజేపీ, బీఆర్ఎస్లను చామల ప్రశ్నించారు. ఇటీవల ఎర్రగడ్డ దగ్గర మైనార్టీలకు ఖబరిస్తాన్ కోసం స్థలం కేటాయిస్తే కూడా ఈ రెండు పార్టీలు జనాన్ని రెచ్చగొట్టిన విషయాన్ని గుర్తు చేశారు చామల.
ఇదే సమయంలో బీజేపీ ద్వంద వైఖరిని కూడా ఎంపీ చామల ఎండగట్టారు. గత ఏడాది జనవరిలో రాజస్థాన్లో జరిగినటు వంటి బైపోల్స్లో గంగానగర్ జిల్లాలో శ్రీకరణ్పూర్ నియోజకవర్గంలో సురేందర్పాల్ సింగ్ అనే వ్యక్తిని 20 రోజుల ముందు అభ్యర్థిగా ఖరారు చేసిన బీజేపీ ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చిందన్నారు. వాళ్లు చేస్తే ఒప్పు.. మేము చేస్తే తప్పా అంటూ బీజేపీ నేతలను ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఎన్నికలను సాకుగా చూపిస్తూ మైనార్టీలను దెబ్బకొట్టాలన్న ప్రయత్నాన్ని బీజేపీ చేస్తుంటే, ఆ పార్టీకి అన్ని రకాలుగా బీఆర్ఎస్ వంత పాడడం చూస్తుంటే ఆ రెండు పార్టీలు ఒక్కటే అన్న విషయం స్పష్టంగా అర్థమైపోతుంది.
గత పదేళ్లలో బీఆర్ఎస్ పాలనలో ఎంతో అవినీతి చేసినా, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల పేరుతో దోచుకుంటున్నా, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏనాడూ సీరియస్ యాక్షన్ తీసుకున్న దాఖలాలు లేవన్నారు చామల. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్రెడ్డి గానీ, అప్పట్లో పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్గానీ చూసీచూడనట్లు ఊరుకున్నారే తప్ప, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఎలాంటి విచారణలూ చేయించలేకపోయారన్నారు. కేసీఆర్ కుటుంబ అవినీతిని ఆపలేకపోయారని విమర్శించారు.
మిగులు రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ , అప్పుల ఊబిలో కూరుకుపోతున్నా కూడా నిమ్మకు నీరెత్తినట్లు వాళ్లు వ్యవహరించడం చూస్తుంటే వాళ్లకు తెలంగాణ మీద చిత్తశుద్ధి కన్నా, రాజకీయ ప్రయోజనాలపైనే దృష్టి ఎక్కువ అన్న విషయం అవగతమవుతుందంటూ చామల ఆగ్రహం వ్యక్తం చేశారు.
లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 8 సీట్లు ఎలా వచ్చాయో, బీఆర్ఎస్ ఓట్లన్నీ ఎలా బీజేపీకి మళ్లాయో ప్రతీ ఒక్కరూ గమనించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఈ రోజు ఈ దుస్థితిలో ఉండడానికి కారణమైనటువంటి ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.
